Nara Bhuvaneswari News | కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.
ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం ప్రకటించారు.
మహిళల వ్యక్తిత్వ హననం చేసే విధంగా వైసీపీ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు మహిళా సమాజం పై వారి అభిప్రాయాలు ఏంటో తెలియజేస్తున్నాయన్నారు. ఇలాంటి పోకడలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు.
రాజధాని రైతుల ఉద్యమ సమయంలో కావచ్చు, అమరావతి ప్రాంత మహిళలపై కావచ్చు…గతంలో ఇలాంటి దాడులు, వ్యాఖ్యలే చేశారని ధ్వజమెత్తారు. అయితే స్త్రీలను ఇలాంటి పోకడల ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నాలు ఫలించవని, నేటి తరం మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదన్నారు.
అవమానకరమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతీసే చర్యలతో మహిళల విలువను, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరని చెప్పారు. స్త్రీలను కించపరిచే, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఐక్యంగా ఎదిరించి మరింత బలంగా నిలబడదామని పిలుపునిచ్చారు.










