Telangana Heat Wave Alert | తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. రానున్న ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఆ తర్వాత జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మంత్రి తెలిపారు.
ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని.. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రక్షణగా వస్త్రాలు ధరించాలని సూచించారు.
అధికారులకు ఆదేశాలు..
తాగునీటి సరఫరా, వైద్య సేవలు, అంబులెన్స్ లు మరియు అగ్నిమాపక సిబ్బందిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఒకవైపు ఎండలు, మరోవైపు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఎండల తీవ్రతపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.











