Attack On RTC Bus | హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.
ఈ విషయాన్ని ఆర్టసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు.
“ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి.
వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది” అని తెలిపారు సజ్జనార్.