– ప్రధానిపై తనికెళ్ళ భరణి ఆసక్తికర పోస్ట్.. నెట్టింట వైరల్!
Tanikella Bharani Post On Modi | తన నటనతో, కలంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనుభూతిని ఆయన పరమాద్భుతంగా అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరుతున్న ప్రధాని మోదీకి బేగంపేట విమానాశ్రయంలో తనికెళ్ళ భరణి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ప్రధానితో ఆయన కాసేపు ముచ్చటించారు. “నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆదిశంకరుల్ని, వివేకానందుణ్ణి చూడలేదు.. చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను” అంటూ భరణి గారు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
“ఆయన్ను ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యం” అని ఆయన రాసుకొచ్చిన మాటలు మోదీ పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవాన్ని చాటిచెబుతున్నాయి.
ప్రధాని చేతిని పట్టుకుని ఎంతో వినమ్రంగా మాట్లాడుతున్న తనికెళ్ళ భరణి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా తనికెళ్ళ భరణి గారు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీని పురాణ పురుషులు, మహానుభావులతో పోల్చడం ద్వారా ఆయన తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని మరోసారి ఆవిష్కరించారు.
దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నప్పటికీ, ఒక కళాకారుడిగా ఆయన వ్యక్తపరిచిన భావం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.







