Sajjanar Felicitates Man for Rescuing People during Nampally Fire Accident | హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మాల్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో తన ప్రాణాలను తెగించి మరీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు దినేష్ అని వ్యక్తి. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ దినేష్ ను సత్కరించారు. ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్ అని సజ్జనర్ కొనియాడారు. అఫ్జల్గంజ్కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుందన్నారు. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారని అభినందించారు.
ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం అని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేశారు. కేవలం దినేష్ మాత్రమే కాదు..ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసిందని తెలిపారు. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారని కష్టం వస్తే ‘మేమంతా ఒక్కటే’ అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారని సజ్జనర్ పేర్కొన్నారు.











