Rajasingh Resign News | గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం కాషాయ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.
రాజీనామా లేఖను కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి అందజేసినట్లు రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సోమవారం తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు జరిగాయి.
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధ్యక్ష పదవి కోసం అధిష్టానం ఎంపిక చేసింది. ఈ నిర్ణయం పై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నామినేషన్ వేయడానికి ఆయన సోమవారం మధ్యాహ్నం బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ తనకు మద్దతుగా వచ్చిన వారిని నాయకులు బెదిరించారని, తనను నామినేషన్ వేయకుండా చేశారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రాజీనామా చేస్తూ ఆ లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న బండి సంజయ్ రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
కానీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని రాజాసింగ్ స్పష్టం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు కథనాలు వస్తున్నాయి.










