Kalvakuntla Kavitha News | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలని డిమాండ్ చేశారు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత.
ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందని పేర్కొన్నారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోందని, అలాగే బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4,5,6 తేదీల్లో తాను 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి నిరాహారదీక్ష చేస్తామని.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్ష కు దిగుతామని స్పష్టం చేశారు.











