INDI Alliance VP Candidate | భారత ఉప రాష్ట్రపతి (Vice President) పదవికి జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేయడంతో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఎన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తదుపరి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పేరును ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
ప్రస్తుతం ఎన్డీయే కూటమి పార్టీలతోపాటు, మిగిలిన పార్టీలకు సైతం ఫోన్ చేస్తూ తమ అభ్యర్థికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది బీజేపీ. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపుకు అవసరం అయిన సభ్యుల సంఖ్యా బలం ఉంది. దీంతో సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక లాఛనమే.
అయినప్పటికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదట తమిళనాడుకే చెందిన దళిత నేత తిరుచ్చి శివ పేరు వినిపించినప్పటికీ, తాజాగా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.











