CM Revanth Helps Student | కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్ (Gulla Rakesh) గురించి తెలుసుకుని వెంటనే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).
ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేష్ కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలంగా సూడో మస్య్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వచ్చాడు.
రాకేష్కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని, పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.
తమ బిడ్డను ఆదుకోవడానికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.