BJP Allegations On Sonia Gandhi | దేశంలో ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా బీజేపీ, ఈసీపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, బీజేపీ ఓ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి ముందే ఆమె పేరు ఓటరు జాబితాలో నమోదైందని బీజేపీ నేత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హెడ్ అయిన అమిత్ మాలవీయ ఆరోపించారు.
ఈ మేరకు దీనికి సంబంధించిన కొన్ని పత్రాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పౌరసత్వం లేని వ్యక్తి ఓటరుగా నమోదు కావడం ఎన్నికల చట్టాల ఉల్లంఘనే అని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ 1983 ఏప్రిల్లో భారత పౌరసత్వం పొందగా, అంతకు ముందే ఆమె పేరు రెండుసార్లు ఓటరు జాబితాలో నమోదైందని పేర్కొన్నారు.
మొదటిసారి 1980లో ఆమె ఇటాలియన్ పౌరసత్వంతో ఉన్నప్పటికీ.. ఓటరుగా నమోదయ్యారని తెలిపారు. ప్రజా వ్యతిరేకత, నిరసనల కారణంగా ఆమె పేరును 1982లో తొలగించారని వెల్లడించారు. అయితే 1983లో ఏప్రిల్ 30వ తేదీన ఆమెకు భారత పౌరసత్వం వస్తే, 1983 జనవరి నెలలో ఆమె పేరు మళ్లీ ఓటరు జాబితాలో కనిపించిందని పేర్కొన్నారు.
ఇది ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమేనని.. ఒక విదేశీయురాలు భారత ఓటరు జాబితాలో ఎలా నమోదు అయ్యారని మాలవీయ ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన రాలేదు.











