- సీఎం సామ్రాట్ చౌదరి ఊహించని సపోర్ట్!
Bihar Team In IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో త్వరలోనే మరో సరికొత్త జట్టు ఎంట్రీ ఇవ్వబోతోందా? ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరహాలోనే బీహార్ రాష్ట్రానికి కూడా ఒక సొంత ఐపీఎల్ టీమ్ రాబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
వేదాంత గ్రూప్ (Vedanta Group) చైర్మన్, ప్రముఖ బిలియనీర్ అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా లేవనెత్తిన ఈ ‘క్రేజీ ఐడియా’కు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేరుగా పూర్తి మద్దతు ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
బీహార్ క్రికెట్ అభివృద్ధికి మరియు యువతకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.
బీహార్ రత్నాలను గుర్తుచేసిన వేదాంత బాస్..
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఎక్స్ (X) వేదికగా బీహార్ క్రికెట్ ఘనతను, అక్కడి అసాధారణ ఆటగాళ్ల ప్రతిభను ప్రస్తావిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ (Double Century) సాధించి రికార్డు సృష్టించాడని కొనియాడారు.
సమస్తీపూర్ జిల్లాకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడని గుర్తుచేశారు.
గోపాల్గంజ్ లోని ఒక అత్యంత పేద కుటుంబంలో జన్మించిన సాకిబ్ హుస్సేన్, తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించారు.
“దేశానికి ఇంతమంది అసాధారణ క్రికెటర్లను అందించినప్పటికీ, ఐపీఎల్ లో బీహార్కు తగిన గుర్తింపు రావడం లేదు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, స్టేడియాలు లభిస్తే.. బీహార్ క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా అవతరిస్తుంది.
బీహార్ యువత ప్రతి రంగంలోనూ దూసుకుపోవాలి, ఈ ప్రయత్నానికి నా పూర్తి మద్దతు, సహకారం ఉంటాయి” అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సానుకూలం!
బిలియనీర్ అనిల్ అగర్వాల్ ప్రతిపాదన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వెంటనే స్పందించారు.
అనిల్ అగర్వాల్ ఆలోచనను అభినందిస్తూ.. బీహార్కు ఐపీఎల్ టీమ్ ఉండాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సపోర్ట్ ఉంటుందని ప్రకటించారు.
రాష్ట్రంలో క్రీడాకారులకు అవసరమైన స్టేడియాలు, వరల్డ్ క్లాస్ సౌకర్యాల కల్పనకు మరియు క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తుందని సీఎం హామీ ఇచ్చారు.
బీహార్ కు సొంత ఐపీఎల్ ఫ్రాంచైజీ వస్తే.. అది కేవలం క్రీడల పరంగానే కాకుండా, రాష్ట్రంలో టూరిజం, వ్యాపార పెట్టుబడులకు భారీగా గేట్లు తెరిచినట్లు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







