CM Revanth Enquiry On KCR Farmhouse తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్రావు (కేసీఆర్) కు చెందిన ఎర్రవల్లి ఫామ్హౌస్పై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు.
ఈ విచారణను వేగవంతం చేసి, రాబోయే 30 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఫామ్హౌస్ పరిధిలో ఉన్న భూములపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
388 ఎకరాల ప్రభుత్వ భూమి?
కేసీఆర్కు 700 ఎకరాల ఫామ్హౌస్ ఉందో లేదో సమగ్ర విచారణలో నిగ్గుతేలుస్తామని సీఎం తెలిపారు. అందులో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనే సమాచారం ఉందన్న ఆయన, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచిపెడతామని స్పష్టం చేశారు.
కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో మొత్తం 439 ఎకరాల భూమి ఉందంటూ సీఎం వివరాలను చదివి వినిపించారు.
కేసీఆర్ కుటుంబం: సిద్దిపేటలో 67.5 ఎకరాలు
కేటీఆర్ కుటుంబం: 123 ఎకరాలు
హరీశ్రావు కుటుంబం: 30 ఎకరాలు
కవిత కుటుంబం: 37 ఎకరాలు
జోగినపల్లి సంతోష్ కుమార్ కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్ రావుకు 52 ఎకరాలు, కొండల్ రావుకు 48 ఎకరాల భూములు ఉన్నాయని పేర్కొన్నారు.
జన్వాడ ఫామ్హౌస్పై ఎద్దేవా..
కేటీఆర్ జన్వాడ ఫామ్హౌస్పై తాను బాంబులు వేయిస్తాననడంపై విపక్ష వ్యాఖ్యలను సీఎం తిప్పికొట్టారు. “నేనేమైనా ఒసామా బిన్ లాడెన్నా బాంబులు వేయడానికి?” అంటూ సభలో ఎద్దేవా చేశారు.
జీవో 118 బాధితులకు గుడ్ న్యూస్..
ఎల్బీనగర్ పరిధిలోని జీవో 118 కింద భూముల క్రమబద్ధీకరణ సమస్యలతో సతమతమవుతున్న సుమారు 9,500 మంది బాధితులకు త్వరలోనే శుభవార్త అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.










