Ayodhya Ram Mandir 4 Crore Cheque Bounce | అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందిన ఒక భారీ విరాళం చెక్కు బౌన్స్ కావడం సంచలనం సృష్టించింది. ఆలయ సిబ్బంది సౌకర్యాల కల్పన కోసం చెన్నైకి చెందిన ఒక మహిళా భక్తురాలు ఇచ్చిన రూ. 4 కోట్ల చెక్కు బౌన్స్ కాగా, బ్యాంకు అధికారులు పరిశీలించగా ఆ ఖాతాలో కేవలం రూ. 3 మాత్రమే ఉండటం గమనార్హం.
ట్రస్ట్ ఈ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో బౌన్స్ అయింది. ఖాతాలో రూ. 3 మాత్రమే ఉంచుకుని ఇంత పెద్ద మొత్తంలో చెక్కు ఎందుకు జారీ చేశారో వివరణ కోరుతూ ఆ మహిళకు నోటీసు పంపేందుకు బ్యాంకు సిద్ధమవుతోంది.
నివేదికల ప్రకారం, తాను ఇచ్చిన రూ. 4 కోట్లను కేవలం ఆలయ సిబ్బంది సౌకర్యాల కోసమే వినియోగిస్తామని ట్రస్ట్ నుంచి సదరు మహిళ లిఖితపూర్వక హామీ కోరారు. ట్రస్ట్ ఎలాంటి లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ మహిళతో చర్చలు జరిపి ఈ విషయాన్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి యత్నిస్తోంది. కాగా, ఆ భక్తురాలు ఆలయానికి విడిగా రూ. 10,000 నగదు విరాళం కూడా ఇచ్చారు.
రూ. 22 కోట్ల చెక్కులు ఇంకా పెండింగ్..
ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం భారీగా నిధులు వస్తున్న వేళ ఈ సంఘటన వెలుగుచూసింది. జూన్లో ఆలయ విరాళాల దొంగతనం, దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన రెండు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో నిర్వహించిన 45 రోజుల భారీ నిధుల సేకరణ కార్యక్రమంలో సుమారు రూ. 3,500 కోట్లు సమకూరాయి.
ఆ సమయంలో సాంకేతిక కారణాలతో సుమారు రూ. 100 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ కాగా, మళ్లీ రీ-డిపాజిట్ చేసి చాలావరకు రాబట్టారు. అయినప్పటికీ ఇంకా రూ. 22 కోట్ల విలువైన చెక్కులు వసూలు కావాల్సి ఉంది. ఆలయానికి ప్రస్తుతం ప్రతి నెలా నగదు, ఆన్లైన్, చెక్కుల ద్వారా రూ. 3-4 కోట్ల విరాళాలు అందుతుండగా, ఒక్క చెక్కుల ద్వారానే రూ. 1-1.5 కోట్లు వస్తున్నాయి.











