Uttarakhand Constable Sher Singh NEET Protest | నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థి ఆందోళనల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్ పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుల్ షేర్ సింగ్ నిరసన వేదికపైకి వచ్చి ప్రసంగించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఆందోళనలో పాల్గొనడానికి తాను దాదాపు 15 రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేశానని, దేశాన్ని కాపాడుకోవడానికి ఉద్యోగం పోయినా పరవాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
శేర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు..
ఉత్తరాఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్లు కిరాణా కొట్టులో సరుకుల్లా అమ్ముడవుతున్నాయని, పట్వారీలు, ఫారెస్ట్ ఆఫీసర్లకు ఈ పేపర్లు ఎలా దొరుకుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.
దేశంలో ‘ఒకే దేశం – ఒకే పన్ను’ (GST) ఉన్నప్పుడు, అందరికీ సమానమైన ఉమ్మడి విద్యా విధానం (Uniform Education System) కూడా ఉండాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా రైతు, కూలీల పిల్లలేనని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠినంగా ప్రవర్తించవద్దని కోరారు.
నిరసనలను రాజకీయం చేయడానికి కాకుండా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్లాగా పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని, సోనమ్ వాంగ్చుక్ వంటి వ్యక్తులు చట్టసభల్లోకి రావాలని ఆకాంక్షించారు.
“అతనో నేరస్థుడు, సస్పెండ్ చేశాం”: పోలీసుల క్లారిటీ
షేర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ కుమావూ రేంజ్ ఐజీ నివేదిత కుక్రేటి (IG Nivedita Kukreti) ఒక వీడియో ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చారు. షేర్ సింగ్ వాదనలను ఆమె తీవ్రంగా ఖండించారు.
పిథోరాగఢ్ జిల్లాలో పనిచేస్తున్న షేర్ సింగ్ జూన్ 28 నుంచి విధులకు గైర్హాజరయ్యాడని, ఎస్పీ ఇచ్చిన నోటీసుకు స్పందించకపోవడంతో జూలై 20నే అతడిని సస్పెండ్ చేశామని తెలిపారు.
షేర్ సింగ్కు నేర చరిత్ర ఉందని వెల్లడించారు. ప్రవీణ్ వాల్మీకి అనే గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి అమాయకులను బెదిరించి భూములు ఆక్రమించాడనే ఆరోపణలతో 2025 జనవరి 15న అతడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడని చెప్పారు.
అతడిపై ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించే డిపార్ట్మెంటల్ చర్యలతో పాటు విచారణ నడుస్తోందని, నిరసనల్లో అబద్ధాలు ప్రచారం చేసినందుకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఐజీ స్పష్టం చేశారు.











