- ‘చిల్లర లేదు.. దిగిపో’ అన్న కండక్టర్..
- వాస్తవ పరిస్థితి చూసి షాక్!
Karnataka Transport Minister Surprise Inspection | అధికార గర్వం ప్రదర్శించకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఒక మంత్రికి విస్మయకరమైన అనుభవం ఎదురైంది.
కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ శనివారం బెంగళూరు నగరంలో సాదాసీదా ప్రయాణికుడిలా మారువేషంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అయితే, ఆయన వద్ద సరిగ్గా ఛార్జీ (చిల్లర) లేదనే కారణంతో ఒక కండక్టర్ ఏకంగా మంత్రిగారినే బస్సులోంచి దిగిపొమ్మని కోరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాధారణ పౌరులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సంఘటన కళ్ళకు కట్టింది.
రెండు గంటల రహస్య ఆపరేషన్.. మాస్క్ తో ప్రయాణం..
బెంగళూరు నగర రవాణా సంస్థ (BMTC) బస్సుల్లో సేవల తీరును పరిశీలించేందుకు మంత్రి బైరతి సురేష్ ముఖానికి ఫేస్ మాస్క్ ధరించి రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన సుమారు 10కి పైగా బీఎంటీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు.
ఈ క్రమంలో ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలను ఆయన స్వయంగా గమనించారు. తనిఖీలో భాగంగా ఫన్ వరల్డ్ బస్ స్టాప్ వద్ద ఒక ప్రయాణికుడు బస్సు ఆపాలని సైగ చేసినప్పటికీ, బీఎంటీసీ బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు.
అక్కడే ఉన్న మంత్రి దీనిపై తక్షణమే స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదరు బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
‘రూ. 100 నోటి’కి టికెట్ లేదు.. బస్సు దిగాల్సిందే!
ఈ రహస్య తనిఖీలో మంత్రికి ఎదురైన అత్యంత ఆసక్తికరమైన అనుభవం హెబ్బాల్-నాగశెట్టిహళ్లి రూట్ బస్సులో జరిగింది. మంత్రి సురేష్ బస్సు ఎక్కి టికెట్ కొనేందుకు కండక్టర్కు రూ. 100 నోటు ఇచ్చారు.
అయితే, ఆ కండక్టర్ చిల్లర లేదనే సాకుతో ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా.. బస్సులోంచి కిందకు దిగిపోవాలని కరాఖండీగా చెప్పేశాడు.
నిత్యం వేలాది మంది ప్రయాణికులు కండక్టర్ల నుండి ఎదుర్కొనే ఈ ‘చిల్లర’ సమస్యను రవాణా శాఖ మంత్రే స్వయంగా అనుభవించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఆటో డ్రైవర్ గుట్టు రట్టు..
మంత్రిగారి తనిఖీలు కేవలం బస్సు ప్రయాణంతోనే ముగిసిపోలేదు. నాగశెట్టిహళ్లి వద్ద బస్సు దిగిన తర్వాత ఒక ఆటోరిక్షా డ్రైవర్ ప్రయాణికుడిని మోసం చేయడాన్ని ఆయన గమనించారు.
ఫేర్ మీటర్లో రూ. 30 చూపిస్తున్నప్పటికీ, సదరు ఆటో డ్రైవర్ ప్రయాణికుడి నుండి రూ. 36 డిమాండ్ చేస్తూ గొడవకు దిగాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రి బైరతి సురేష్, ఆటో డ్రైవర్ తీరును తప్పుబడుతూ ప్రయాణికుడికి అండగా నిలిచారు.
ఈ మొత్తం ఆపరేషన్ను ఒక ‘రియాలిటీ చెక్’ (వాస్తవ పరిస్థితిని పరిశీలించే చర్య) గా రవాణా మంత్రి అభివర్ణించారు. నగర ప్రజా రవాణా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, రవాణా సిబ్బందిలో క్రమశిక్షణను అమలు చేయడానికి మరియు సామాన్యుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి బెంగళూరు వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మున్ముందు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం రవాణా రంగంలో తీసుకుంటున్న కఠినమైన వైఖరికి ఈ రహస్య ఆపరేషన్ ఒక ఉదాహరణగా నిలిచింది.








