Pawan Kalyan Visits Hanumakonda | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారి అభిమాని ఆఖరి కోరికను తీర్చేందుకు ఆయన స్వయంగా హనుమకొండకు వెళ్లారు.
బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ హనుమకొండకు చేరుకుని ఆ అభిమానిని పరామర్శించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో..
హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు అత్యంత ఇష్టమైన నటుడని, తన జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలవడమే తన ఏకైక ఆకాంక్ష అని నిరంజన్ ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ భావోద్వేగ భరితమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జనసేన పార్టీ వర్గాల దృష్టికి వెళ్లింది.
స్పందించిన జనసేనాని..
తన అభిమాని పరిస్థితిని, అతని ఆఖరి కోరికను పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. నిరంజన్ను కలిసి ధైర్యం చెప్పేందుకు ఆయన తన పర్యటనను ఖరారు చేసుకున్నారు. బుధవారం స్వయంగా హనుమకొండకు వెళ్లిన పవన్.. నిరంజన్ నివాసానికి చేరుకుని అతడిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.
భద్రకాళి అమ్మవారి దర్శనం.. అభిమాని నిరంజన్ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ హనుమకొండలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు.











