Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > స్లోవేకియాలో మోదీ.. ‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయంతో ఘన స్వాగతం!

స్లోవేకియాలో మోదీ.. ‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయంతో ఘన స్వాగతం!

PM Modi Slovakia Visit | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల ఐరోపా (యూరప్) పర్యటనలో భాగంగా రెండవ దేశమైన స్లోవేకియాలో చారిత్రాత్మక పర్యటనను ప్రారంభించారు.

ఆదివారం రాత్రి స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం, ప్రవాస భారతీయులు అత్యంత ఘనంగా, అపూర్వ స్వాగతం పలికారు.

1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత.. ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయ ఆతిథ్యం..

బ్రాటిస్లావా చేరుకున్న ప్రధాని మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానర్ ఘన స్వాగతం పలికారు. స్లోవాక్ సంప్రదాయం ప్రకారం అత్యంత గౌరవనీయులైన అతిథులకు ఇచ్చే ‘బ్రెడ్ అండ్ సాల్ట్’ (రొట్టె, ఉప్పు) ను ప్రధానికి అందిస్తూ ఆత్మీయంగా ఆహ్వానించారు. స్లోవాక్ సంస్కృతిలో ‘బ్రెడ్’ అనేది సంపద, సమృద్ధికి.. ‘సాల్ట్’ అనేది విలువైన బంధం, రక్షణకు చిహ్నంగా భావిస్తారు.

‘వందేమాతరం’ విన్యాసాలు..

స్థానిక లూసినికా గ్రూప్ కళాకారులు ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించగా, మైజావా ప్రాంతానికి చెందిన చిన్న పిల్లల బృందం ‘కొపానిసియారిక్’ సంప్రదాయ జానపద నృత్యాలతో ప్రధానిని అలరించారు. ఈ సంప్రదాయాలు దేశ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసించారు. అలాగే ప్రవాస భారతీయులు భారతీయ జెండాలతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ మోదీకి స్వాగతం పలికారు.

దౌత్య, ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యం..

స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే ద్వైపాక్షిక చర్చల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

“ఈ చారిత్రాత్మక పర్యటన భారతదేశం – స్లోవేకియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి, కొత్త భాగస్వామ్యాలకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని భారతదేశాన్ని సందర్శించిన పరిణామాల కొనసాగింపుగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారు.

ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్ రంగాలు, డిఫెన్స్, మరియు రైల్వే తయారీ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి.

You may also like
అర నిమిషంలో 195ముద్దులు.. గిన్నిస్ బుక్‌లోకెక్కిన లవర్స్!
ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!
ఇరాన్‌పై ట్రంప్ ‘బూతు’ పురాణం.. 48 గంటల డెడ్‌లైన్!
new couple invites orphans as cheif guests
నూతన దంపతుల గొప్ప మనసు.. అనాథలే ముఖ్య అతిథులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions