Metro Rail MD Clarification On Ameerpet Pillar Damage Rumors | అమీర్పేట్, మైత్రీవనం సమీపంలోని “కెఎస్సార్ ఫ్యాషన్స్” షాపింగ్ కాంప్లెక్స్ లో గురువారం సంభవించిన భారీ అగ్నిప్రమాదం తర్వాత.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి.
ప్రమాదం జరిగిన భవనం మెట్రో పిల్లర్ నంబర్ A1043 కి అత్యంత సమీపంలో ఉండటంతో, మంటల తీవ్రత వల్ల మెట్రో పిల్లర్కు పగుళ్లు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం సాగింది.
అయితే, ఈ వార్తలను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా ఖండించారు. అమీర్పేట్లోని మెట్రో పిల్లర్కు గానీ, మెట్రో వ్యవస్థకు గానీ ఎటువంటి నిర్మాణపరమైన నష్టం వాటిల్లలేదని ఆయన స్పష్టం చేశారు.
అడ్వర్టైజ్మెంట్ షీట్లు మాత్రమే దగ్ధం..
మెట్రో మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని, మెట్రో ఆస్తులన్నీ యథావిధిగా, సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు. మంటల తీవ్రత వల్ల కేవలం పిల్లర్పై ఉన్న అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనల) షీట్లు మాత్రమే కాలిపోయాయని, లోపలి ప్రధాన కాంక్రీట్ పిల్లర్కు గానీ, ఇతర నిర్మాణ లేదా నిర్వహణ భాగాలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు స్పష్టత ఇచ్చారు.
నిరంతరాయంగా మెట్రో సేవలు..
ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడిన మాట నిజమేనని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగానే రాకపోకలు: పొగ ఇబ్బంది పెట్టినప్పటికీ, మెట్రో రైలు సేవలకు ఎక్కడా అంతరాయం కలగలేదని, రైళ్ల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా కొనసాగాయని తెలిపారు.
మెట్రో పిల్లర్ సురక్షితంగా ఉన్నప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మెట్రో ఆస్తులు, పిల్లర్ల కండిషన్పై సాంకేతిక బృందాలతో లోతైన పరిశీలన (ఇన్స్పెక్షన్) చేపట్టినట్లు మెట్రో ఉన్నతాధికారులు వివరించారు. కాబట్టి ప్రయాణికులు ఎలాంటి అపోహలు, రూమర్లను నమ్మవద్దని కోరారు.







