- రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం..
- అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!
PM Narendra Modi Wishes Telangana Formation Day |జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ సమాజం గొప్పదనాన్ని, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కొనియాడుతూ ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
తెలంగాణ వైభవానికి ప్రధాని ప్రశంసలు..
తెలంగాణ ప్రజల సృజనాత్మకత, వ్యాపార నైపుణ్యాలు దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ప్రధాని మోదీ కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం అంటేనే ధైర్యానికి, అచంచలమైన సంకల్పానికి, అసమానమైన పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. ఈ గడ్డకు ఎంతో గొప్ప చరిత్ర, వైభవోపేతమైన విశిష్ట సంస్కృతి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ పాత్రను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘వికసిత భారత్’ అనే మన జాతీయ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని ప్రధాని అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
చివరగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు, అపారమైన విజయాలు కలగాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
‘దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న మన స్వరాష్ట్రం..ఆత్మగౌరవ నినాదంతో మొదలై.. పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాన్ని రగిలించి, యేండ్ల కలను సాకారం చేసుకున్న రోజు.. జూన్ 2.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ… రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
‘తెలంగాణ ఆత్మగౌరవం కోసం, స్వరాష్ట్ర కల సాకారం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. ఈ చారిత్రక దినాన ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ.. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!’ అని హోం శాఖ సహాయ మంత్రి తెలిపారు.
అధికారాలు మారొచ్చు…కానీ ఉద్యమ చరిత్ర మారదు..! తెలంగాణ కోసం పోరాడిన ప్రతి క్షణంలో బిజెపి పేరు గర్వంగా వినిపిస్తుంది స్వరాష్ట్ర సాధనకై కోసం బిజెపి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
ఉద్యమ జ్వాలలో నిలిచిన బిజెపి జెండా ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజల గుండెల్లో రెపరెపలాడుతోంది.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ట్వీట్ చేశారు.










