- అనిరుధ్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్!
Janasena MLA Bolisetti Fires On Anirudh Reddy | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు జనసేన గట్టి కౌంటర్ ఇచ్చింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ను రాజకీయంగా టార్గెట్ చేయడం మాని, చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ వివాదంలో అనిరుధ్ రెడ్డి చేసిన ‘గో బ్యాక్ ఆంధ్రా’ హెచ్చరికలపై బొలిశెట్టి శ్రీనివాస్ గట్టి చురకలు అంటించారు.
“తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను ‘గో బ్యాక్’ అని తరిమికొట్టే ధైర్యం అనిరుధ్ రెడ్డికి ఉందా? అది చేతకాక, ఆంధ్రా నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారా?” అని బొలిశెట్టి నిలదీశారు.
తెలంగాణ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాం.. మేం ‘గో బ్యాక్’ అనలేదు..
రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటిన మానవత్వాన్ని వివరిస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ ఒక తాజా ఉదాహరణను మీడియా ముందు ఉంచారు.
తాజాగా తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం సీడబ్ల్యూసీ (CWC) గోడౌన్కు మొక్కజొన్న లోడ్తో వచ్చిన 40 లారీల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా తానే స్వయంగా స్పందించి, ఆ డ్రైవర్ల సమస్యను పరిష్కరించానని బొలిశెట్టి గుర్తుచేశారు.
వారు తెలంగాణ నుండి వచ్చారని తాము ఎప్పుడూ ‘గో బ్యాక్’ అనలేదని, ప్రజాప్రతినిధులుగా సమస్యలను పరిష్కరించాలే తప్ప ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టకూడదని అనిరుధ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.







