Anti-drug pledge in TG Schools | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో పొగాకు, మద్యం, మరియు మాదక ద్రవ్యాలకు (Drugs) వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించింది.
గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ..
ఈ కార్యక్రమానికి సంబంధించి సోమవారం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన ‘స్కూల్ కిట్లను’ పంపిణీ చేయనున్నట్లు గవర్నర్కు వివరించారు. ఈ కిట్ల పంపిణీ మరియు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ మరియు ‘ఈగల్’ (Eagle) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం జరగనుంది. కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యా సంస్థల యాజమాన్యాలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా విద్యా సంస్థలను ‘డ్రగ్స్ రహిత’ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల పునఃప్రారంభం నేపథ్యంలో యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్ చేపట్టనున్నారు. వ్యసనాల బారిన పడకుండా విద్యార్థుల్లో చైతన్యం కల్పించనున్నారు. మొదటి రోజే విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేయనున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని ప్రాథమిక స్థాయిలోనే అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.







