- సీఎంగా విజయ్ భావోద్వేగ తొలి ప్రసంగం!
TN CM Vijay First Speech | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamilnadu Chief Minister) గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ‘దళపతి’ విజయ్ ప్రజలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగం అటు అభిమానులను, ఇటు సామాన్య ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
తన రాజకీయ ప్రయాణంలో యువత పోషించిన పాత్రను కొనియాడుతూనే, పరిపాలనలో తన మార్కును స్పష్టం చేశారు.
“నా వెనుక నిలబడిన యువతే నా బలం. మీ ‘విజయ్ మామ’ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అంటూ యువతపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.
“నేను ఏదో పై నుంచి వచ్చిన దేవదూతను కాదు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మీ ఇంట్లో అన్నలా, తమ్ముడిలా, మీలో ఒకడిగా ఉంటాను. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి తమిళ పౌరుడికి రుణపడి ఉంటాను” అని వ్యాఖ్యానించారు.
“హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఈ అన్ని మతాల కలయికే విజయ్ ముఖం. రాష్ట్రంలో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం నేటితో ప్రారంభమైంది” అని ప్రకటించారు. “రాజకీయాల్లో ఏది ఉన్నా నేరుగా మాట్లాడుతాను.
ఎవరికీ తెలియకుండా చీకటి ఒప్పందాలు, చీకటి రాజకీయాలు చేయను. అన్నీ నేర్చుకోవడానికి నాకు కొంత సమయం ఇవ్వండి. ఏది సాధ్యమో అదే చేస్తాను తప్ప.. అసాధ్యమైన హామీలు ఇవ్వను” అని స్పష్టం చేశారు.
సింగిల్ పవర్ సెంటర్..
తన ప్రభుత్వంలో కేవలం ఒకటే ‘పవర్ సెంటర్’ ఉంటుందని, మహిళల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని హామీ ఇచ్చారు విజయ్. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లపై త్వరలోనే ‘శ్వేతపత్రం’ విడుదల చేస్తామని, పేదరికం మరియు ఆకలి బాధలు తనకు తెలుసునని భావోద్వేగంగా మాట్లాడారు.
విజయ్ తన ప్రసంగంలో ‘మామ’ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలోని యువతను, విద్యార్థులను భావోద్వేగంగా తన వైపు తిప్పుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ‘చీకటి రాజకీయాలు చేయను’ అనడం ద్వారా పాత రాజకీయ వ్యవస్థపై ఆయన పరోక్షంగా విమర్శలు సంధించారు.







