- ఎల్బీ నగర్ కేబీఆర్ కన్వెన్షన్ హాల్ లో మార్చి 21, 22 తేదీల్లో.
- కేబీకే హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం
- పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ & టెక్ట్స్ టైల్ ఎగ్జిబిషన్
- ఆర్బీఎం ఎక్స్పో
కపోతం, హైదరాబాద్: సీనియన్ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ (Babu Mohan) మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనేక అనారోగ్య సమస్యలు ఉండి డబ్బుల్లేక కనీసం వైద్యుడిని సంప్రదించలేని నిరుపేదల కోసం తన వంతుగా సాయం చేయాలనే సంకల్పంతో పవన్ బాబూమోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ (Pavan Babu Mohan Charitable Trust) ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు.
అందులో భాగంగా కేబీకే హాస్పిటల్స్ (KBK Hospitals) సౌజన్యంతో మార్చి 21, 22 తేదీల్లో ఎల్బీ నగర్ లోని కేబీర్ కన్వెన్షన్ హాల్ లో ఆర్బీఎం, వందేభారత్ ట్రస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉప్పల్ లోని కేబీకే గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కేబీకే హాస్పిటల్స్ చైర్మన్ డా. కక్కిరేణి భరత్ కుమార్ తో భేటీ అయ్యారు.
ఆర్బీఎం ప్రతినిధి శివ ప్రసాద్, వందేభారత్ ట్రస్ట్ ప్రతినిధి, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లితో కలిసి హెల్త్ క్యాంప్ నిర్వహణకు సంబంధించి చర్చించారు. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా సుమారు ఐదువేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ నిరుపేదలకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే తన కుమారుడు పవన్ పేరుతో ఈ పవన్ బాబూ మోహన్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మందిని చదివిస్తున్నాననీ, చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారని వివరించారు.
ఇంకా ఏదైనా చేయాలనే తపనతోనే ఈ వైద్య శిబిరాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేబీకే గ్రూప్ చైర్మన్ అధినేత కక్కిరేణి భరత్ కుమార్ సహకారంతో కేబీకే హాస్పిటల్స్ ద్వారా ఈ మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో అర్హులైన పేదల అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉచింతంగా మందులు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు.
అనంతరం డా. భరత్ కుమార్ మాట్లాడుతూ బాబూ మోహన్ గారి సేవా కార్యక్రమాలకు తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు. గాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి అనేక షుగర్ సంబంధింత గాయాలకు కేబీకే హాస్పిటల్ ద్వారా అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఎడిట్ పాయింట్ రమేశ్ మాట్లాడుతూ మార్చి 21, 22 తేదీల్లో కేబీకే కన్వేన్షన్ లోనే పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మెగా హ్యాండ్లూమ్, టెక్స్ట్ టైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత వస్త్రాలతోపాటు, మహిళలకు కావాల్సిన ఆభరణాలు, గృహోపకరాణాలు ప్రదర్శనలో ఉంచుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేబీకే గ్రూప్ కక్కిరేణి కిరణ్ కుమార్, ప్రతినిధులు విశాఖ రాజేందర్ రెడ్డి, జక్కి అరుణ్ కుమార్, చప్పిడి శ్రీకాంత్ రెడ్డి, శంకర్ ముద్దగోని తదితరులు పాల్గొన్నారు.










