Velugumatla Issue | వెలుగుమట్ల (Velugumatla) నిర్వాసితులకు మార్చి 15లోపు పట్టాలివనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. వెలుగుమట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు.
ఆదివారం ఖమ్మం ఐడిఓసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. వాస్తవానికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు నరకయాతను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని వారు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారని వెల్లడించారు.
పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారని వివరించారు.
అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటదని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.










