Israel attacks Iran with US help | పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ దేశంపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ శనివారం విరుచుకుపడింది. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా ప్రారంభం అయినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. గతేడాది జూన్ లోనూ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం నెలకొన్న విషయం తెల్సిందే. తాజా క్షిపణి దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగ నగరంలోని పలు ప్రాంతాలను కమ్మేసింది. మరోవైపు ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మిస్సైల్, డ్రోన్ దాడులు జరగొచ్చేనె అంచనాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడి అమెరికా సమన్వయంతోనే జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాతో అణు ఒప్పందం జరుపుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. సైనిక చర్య కూడా ఉండే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఏం జరగబోతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.










