Barlapudi Kranthi | ఏపీలో రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె బార్లపూడి క్రాంతి (Barlapudi Kranthi) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan), తన తండ్రి ముద్రగడపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేకే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ది కోసమే జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించిన జగన్ కు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కాపులు గుర్తొస్తున్నారా? అని నిలదీశారు క్రాంతి.
మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు తరహాలోనే రేపు తన తండ్రి ముద్రగడను కూడా అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.
గతంలో పాదయాత్ర సమయంలో కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి తన తండ్రి మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందని క్రాంతి తెలిపారు.










