Trump announces India ‘trade deal’ after Modi call | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్పై విధించిన సుంకాలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ట్రంప్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అనంతరం సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం విశేషం. భారత దిగుమతి వస్తువులపై అమలవుతున్న ప్రతీకార టారిఫ్ లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు ప్రతిస్పందనగా ట్రంప్ అదనంగా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. కానీ ఇప్పుడు ఈ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసి, అమెరికా, వెనిజులా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలని అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అదనపు 25 శాతం జరిమానా సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్ అమెరికా వస్తువులపై తన సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను క్రమంగా జీరోకి తగ్గిస్తుందని, 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కూడా సహాయపడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.










