TTD News Latest | వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నట్లు, టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.
2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్యలో గణనీయ వృద్ధి ఉందన్నారు. 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికంగా ఈ సారి 44 లక్షల లడ్డూలు విక్రయం జరిగినట్లు తెలిపారు. గతేడాదికంటే 27% అధికంగా అన్నప్రసాదాల పంపిణీ జరిగిందన్నారు. కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయన్నారు. AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేసినట్లు ఛైర్మన్ వెల్లడించారు. ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు టీటీడీ ఛైర్మన్.









