Messi Magic In Hyderabad | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటన అద్భుతంగా సాగింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొన్న మెస్సి అభిమానుల్ని అలరించారు. ఫుట్బాల్లను కిక్ చేస్తూ స్టాండ్స్ లో ఉన్న అభిమానులకు పంపించారు మెస్సి.
ఇలా ఉప్పల్ స్టేడియంలో ఉన్నంతసేపు మెస్సి సరదాగా గడిపారు. మెస్సి వెంట వచ్చిన రోడ్రిగో, సువారేజ్ కూడా మైదానంలో పిల్లలతో ఫుట్బాల్ ఆడుతూ సందడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56 ఏళ్ల వయస్సులో యువ ప్లేయర్లతో పోటీ పడి మరీ గోల్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా మెస్సి, ఇతర ఆటగాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఉప్పల్ స్టేడియంలో మెస్సి కార్యక్రమం ఘన విజయం అయ్యింది. మరోవైపు ఫలకనూమా ప్యాలెస్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా మెస్సి హుందాగా వ్యవహరించారు. అభిమానుల్ని, ప్రముఖులను పలకరిస్తూ వారితో ముచ్చటించారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న కొన్ని పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా కోల్కత్త లో జరిగిన ఈవెంట్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంతో పోల్చుతున్నారు. కోల్కత్తలో సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానాలు నానా హంగామా చేశారు. మెస్సి కేవలం 10 నిమిషాలే ఉండడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దింతో స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రభుత్వం ఈవెంట్ ను హోస్ట్ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. కానీ హైదరాబాద్ లో మెస్సి ఈవెంట్ ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరగడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










