Telangana Rising Global Summit-2025 | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ సమ్మిట్ లో మంగళవారం తెలుగు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్ ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పదని కొనియాడారు.
ఈ మహత్తర కార్యాచరణలో తన దిశా నిర్దేశం కోరడం ఎంతో ఆనందదాయకం అని చిరు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.










