KTR Fires On Cm Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని విమర్శించారు. అందుకే ఫార్మాసిటీలోనూ, పారిశ్రామిక భూముల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని మరోసారి కేటీఆర్ ఆరోపించారు. ఈ పాలసీని వెనక్కి తీసుకొని, రూ.లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు.










