Kishan Reddy News Latest | కేంద్రమంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు అనే రాతిగోడలు పేద విద్యార్థుల చదువు అనే పూల బాటకు అడ్డు రాకూడదని పేర్కొన్న ఆయన..తన పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించేందుకు ముందుకు వచ్చారు.
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి లేఖ రాశారు. అంత్యోదయ స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరి తెలంగాణ SSC బోర్డు పరీక్ష ఫీజులను తన ఎంపీ జీతం నుండి పూర్తిగా భరించనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు బ్యాంకు ఖాతా వివరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, మొత్తం ఎంత ఫీజు చెల్లించాలి అనే వివరాలు తనకు అందించాలని కిషన్ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ ను కోరారు. అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.










