Deputy Cm Pawan Kalyan News | ఉప ముఖ్యమంత్రి అనే పదవికి రాజ్యాంగ హోదా లేనప్పుడు రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర డీజీపీని నివేదిక కోరడం ఏంటని జర్నలిస్టులు హోంమంత్రి అనితను ప్రశ్నించారు.
కాగా భీమవరం డిఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో తలదుర్చుతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని పవన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో డిఎస్పీ వ్యవహారంపై ఫోన్లో మాట్లాడారు. డిఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపాలని స్పష్టం చేశారు.
అయితే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదని అలాంటప్పుడు మంత్రి హోదాలో ఆయన హోంశాఖ పరిధిలోని డీజీపీని నివేదిక కోరడం ఏంటని కొందరు ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి అనిత ధీటుగా బదులిచ్చారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. ఒక శాఖలో సమస్య వస్తే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకురావడంలో ఎలాంటి తప్పులేదన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ సూచనలు ఇవ్వడంలో తప్పులేదన్నారు. ప్రతీదీ భూతద్దంలో చూడడం సరికాదన్నారు. తమకు లేని ఇగో ఇతరులకు ఎందుకన్నారు. భీమవరం డిఎస్పీ అంశంలో తనకు రిపోర్టులు వచ్చాయని తగిన చర్యలు ఉంటాయని హోంమంత్రి స్పష్టం చేశారు.










