AP Govt Good News | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనే వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులైనా, ఎలాంటి పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నీట్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే వారికి కూడా ఈ పావలా వడ్డీకే రుణం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ విద్యా రుణాలకు 4 శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూడాలని, దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని హామీ ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.










