Delhi CM Rekha Gupta Participates in Bathukamma Celebrations Telangana | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే.
ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో రామజస్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేఖా గుప్తా ఢిల్లీలో స్థిరపడిన తెలుగు సమాజం తమ కష్టం, ప్రతిభతో నగరాన్ని తీర్కదిద్ది, ఢిల్లీ సంస్కృతికి కొత్త రంగులు అద్దిందని కొనియాడారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని మాతృత్వం మరియు జీవన సౌందర్యానికి ప్రతీక అని అన్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని చెప్పారు. తెలుగు విద్యార్థులు తమ సాంస్కృతి గౌరవాన్ని పెంచుతున్నారని వారు ఉత్సాహం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ క్రమంలో స్పందించిన ఉపాసన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో పాల్గొన్నందుకు ఢిల్లీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.










