BRS holds protest over urea shortage in Telangana | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
ఖాళీ యూరియా బస్తాలతో గన్ పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. పండగపూట కూడా రైతులను రోడ్లపై నిలబెట్టిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘ గణపతి బప్పా మోరియా-కావాలయ్య యూరియా’ అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతులకు ఎరువులు సరఫరా చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వరదల మూలంగా నష్టపోయిన పంట గురించి, ఎరువుల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఫీజు రీయంబర్సమెంట్ మూలంగా విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలపై కూడా చర్చించాలన్నారు. ఈ క్రమంలో తూతూమంత్రంగా సభను 4 రోజులు నడపడం కాకుండా కనీసం 15 రోజులైనా నడపాలని స్పష్టం చేశారు.










