Murali Nayak Last Rites News | దేశ రక్షణ పౌరుల భద్రత కోసం సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్ వంటి వీరులను కన్న తల్లులకు ఈ మదర్స్ డే అంకితమన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
‘మాతృభూమి రక్షణ కోసం అసువులు బాసిన జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు, మన దేశ రక్షణ కోసం.. కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలకు ఈ మదర్స్ డే అంకితం. ఈ దేశ ముద్దుబిడ్డలు మన సైనికులు. ఇలాంటి రక్షకులకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. యుద్ధభూమిలో బిడ్డను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వాన్ని చూపే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి జన్మకు,గమనానికి మూలం అమ్మ. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు సమానమైనది మరొకటి లేదు. అమ్మ ప్రేమ, దీవెనలే మనకు కొండంత అండ.’ అని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విషయం తెల్సిందే. మురళీ నాయక్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, ఐదు ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. వీరజవాన్ కుటుంబానికి వ్యక్తిగతంగా తాను రూ.25 లక్షలు ఇస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఆదివారం వీర జవాన్ అంత్యక్రియలు ముగిశాయి.
అంత్యక్రియలో మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, అనిత, సవిత మరియు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.










