Army jawan from Sathya Sai district killed in Pakistan firing at LoC | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంట హైటెన్షన్ నెలకొంది.
అయితే చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ వీరమరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతిచెందారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
మురళీ నాయక్ మృతిచెందడంతో ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 2022లో అగ్నివీర్ జవాన్ గా మురళీ నాయక్ సైన్యంలో చేరారు. అయితే మొన్నటివరకు నాసిక్ లో విధులు నిర్వహించారు. పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం మన త్రివిధ దళాలు జరిపిన ఆపరేషన్ సింధూర్ తో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరారు.
ఈ క్రమంలో మురళీ నాయక్ ను అధికారులు నాసిస్ నుంచి జమ్మూకశ్మీర్ కు పిలిపించారు. శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో జవాన్ వీరమరణం పొందారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే తల్లిదండ్రులతో సీఎం ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు.










