Vijayasai Reddy Quits Politics | ఏపీ (Andra Pradesh)లో వైసీపీ (YCP) సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasaireddy) సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా జనవరి 25న రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు.
“వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.
రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా.
కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా.
చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.” అంటూ పోస్ట్ చేశారు విజయసాయి రెడ్డి.