Home Ministry directs several states to conduct mock drills on May 7 | దేశ భద్రతలో భాగంగా పౌరుల్ని సమాయత్తం చేయాలని పలు రాష్ట్రాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. భారతదేశంలో పౌర రక్షణను బలోపేతం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే 7, 2025న దేశవ్యాప్తంగా భద్రతా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మాక్ డ్రిల్స్లో భాగంగా హెచ్చరిక సైరన్లను, శత్రు దాడుల సమయంలో పౌరులు తమను తాము రక్షించుకునేందుకు పౌర రక్షణ అంశాలపై పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధం చేయడం, భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్రం సూచించింది.
దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేయడంలో ఈ మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి నేపథ్యంలో దాయాధి దేశంపై భారత ప్రభుత్వం ప్రతీకార దాడులు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.











