Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > ఆందోళన వద్దు.. రేషన్ కార్డులు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు తీసుకుంటాం: సీఎం

ఆందోళన వద్దు.. రేషన్ కార్డులు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు తీసుకుంటాం: సీఎం

Prajapalana

Praja Palana Application | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకోసం ప్రజా పాలన దరఖాస్తును ప్రారంభించింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చేతుల మీదుగా సెక్రటేరియట్‌లో ప్రజాపాలన దరఖాస్తును ఆవిష్కరించారు.

మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలకు ఈ ఒక్క దరఖాస్తును నింపితే సరిపోతుంది. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ పథకాలను పొందడానికి రేషన్ కార్డు ఉన్న వారే అర్హులని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల తెలిపారు. దరఖాస్తు పత్రాల్లోనూ రేషన్ కార్డు నంబర్‌ను పొందుపర్చాలని సూచించారు. దీంతో రేషన్ కార్డు లేని లక్షలాది మంది అర్హుల్లో.. ఈ పథకాలను పొందలేమోననే ఆందోళన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సందేహాలకు సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డులు లేకుండా పథకాలు ఇవ్వడం కష్టమన్నారు. అందుకోసం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని తెలిపారు.

అయితే రేషన్ కార్డులు లేనివారు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినా తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అదనంగా రేషన్ కార్డు తదితరాల కోసం అప్లికేషన్ ఇచ్చినా తీసుకుంటామన్నారు. ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

తమకు ఏ సమస్య ఉందని చెప్పినా వినతి పత్రాలు స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులను జనవరి ఆరో తేదీ లోపు గ్రామ పంచాయతీల్లో అందించలేకపోతే.. ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాల్లో తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

 

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions