BRS Rajatotsava Sabha News | పార్టీ రజతోత్సవ వేడుకల కోసం భారత రాష్ట్ర సమితి భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నాయకులు ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
మరోవైపు బీఆరెస్ సభా ఏర్పాట్ల పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ చామల విమర్శలు గుప్పించారు. రెండు గంటల సభ కోసం ఖర్చు చేస్తోన్న ఈ వందల కోట్ల ధన ప్రవాహం, ఏ కమీషన్ల తాలుఖాదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతున్నాయని, రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు…హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు… కానీ బీఆర్ఎస్ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయన్నారు.
రూ.వందల కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఈ రకంగా సభ పెట్టడం సాధ్యం కాదన్నారు. సభ ఏర్పాటు తీరే కళ్లు బైర్లు కమ్మేలా ఉందని హంగామా, ఆర్భాటం చూస్తుంటే ఊహకందనంత ఖర్చు అయ్యుంటుందని సామాన్యుడికి కూడా అర్థమవుతోందని తెలిపారు. అయితే ఎక్కడిది ఈ డబ్బు అంటూ బీఆరెస్ ను చామల ప్రశ్నించారు.
కూలిన కాళేశ్వరం కమీషన్ సొమ్మా ?, మిషన్ భగీరథ పేరుతో దోచిన సొమ్మా ? లేక హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన “అదనపు ఫ్లోర్ల” కమీషన్ సొమ్మా…!? ఫార్ములా కార్ రేస్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు దోచిన సొమ్మా…!? అంటూ ఎంపీ కిరణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.











