Bandi Sanjay News Latest | బీఆరెస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు.
ఈ క్రమంలో బండి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ సందర్భంగా అధికారులు చూపిన ఆధారాలు, చెప్పిన విషయాలు విని తాను షాక్ కు గురయినట్లు పేర్కొన్నారు. భార్యాభర్తల ఫోన్ కాల్స్ కూడా విన్నారని కన్నెర్ర చేశారు.
మావోయిస్టుల జాబితాలో తన పేరు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే జాబితాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు సైతం ఉన్నాయని తెలిపారు. తన ఇంట్లో పని చేసే సిబ్బంది ఫోన్లు సైతం ట్యాప్ చేశారని చెప్పారు.
కేసీఆర్ వావివరుసలు మరిచి సొంత కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయించాడాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాధ కిషన్ రావు, ప్రభాకర్ రావులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి వీరికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.










