- నలుగురి ముఠాను అదుపులోకి తీసుకున్న బండ్లగూడ పోలీసులు!
Cryptocurrency Fraud In Hyderabad | సోషల్ మీడియా వేదికగా క్రిప్టోకరెన్సీ వ్యాపారం పేరుతో అమాయకులను నమ్మించి, నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి డబ్బులు గుంజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేర ముఠాను బండ్లగూడ పోలీసులు శరవేగంగా స్పందించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు.
రూ. 7 లక్షలు దోపిడీ..
హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన జె.ఆర్. చౌదరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీల పేరుతో నిందితులు బాధితుడిని ఆగస్టు 15, 2026న బండ్లగూడ పరిధిలోని ఇస్మాయిల్ నగర్కు పిలిపించారు.
అక్కడ ఆయనను బెదిరించి బలవంతంగా రూ. 7,00,000 నగదును లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్పెషల్ టీమ్ను రంగంలోకి దింపారు.
అరెస్టయిన నిందితుల వివరాలు..
విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 17, 2026న చాంద్రాయణగుట్టలోని ‘కింగ్స్ స్నూకర్’ వద్ద గుమిగూడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
A-1: సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్ (కాంచన్బాగ్ – ఫిట్నెస్ ట్రైనర్)
A-2: మహమ్మద్ అబుల్ సలామ్ (కర్వాన్ – విద్యార్థి)
A-3: మహమ్మద్ అనస్ (రాజేంద్రనగర్ – విద్యార్థి)
A-4: మహమ్మద్ ఆసిఫ్ (పహాడీషరీఫ్ – డ్రైవర్)
A-5 (పరారీ): ఆసిఫ్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం, చోరీకి గురైన సొత్తు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నేర విధానం & ఇతర కేసులు..
ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా బాధితులను సంప్రదించి క్రిప్టోకరెన్సీలో భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత ఒక ప్రాంతానికి రప్పించి, బెదిరింపులకు దిగి సొత్తును దోచుకోవడం వీరి శైలి.
విచారణలో ఈ ముఠా గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు తేలింది. బండ్లగూడ పీఎస్ (Cr. No. 304/2026) తో పాటు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో (Cr. No. 86/2026, 261/2026, 310/2026) కూడా వీరికి సంబంధం ఉన్నట్లు గుర్తించి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
పోలీసుల హెచ్చరిక & సిబ్బందికి అభినందనలు..
సోషల్ మీడియా పరిచయాలతో క్రిప్టోకరెన్సీ, ఆన్లైన్ పెట్టుబడులు లేదా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, డబ్బు చెల్లించే ముందే ఎదుటి వ్యక్తుల వివరాలను సరిచూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ. సుధాకర్ పర్యవేక్షణలో కేవలం రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన బండ్లగూడ ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్, సబ్-ఇన్స్పెక్టర్ ఎస్. నాగరాజ్ రెడ్డి మరియు క్రైమ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.







