Agra BJP Councillor Birthday Inside Drain | ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రసిద్ధ తాజ్ మహల్ ఉన్న స్మార్ట్ సిటీ ఆగ్రాలో ఒక విచిత్రమైన, వినూత్నమైన నిరసన వెలుగుచూసింది.
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంపై అక్కడి అధికార పార్టీ (బీజేపీ) కౌన్సిలర్ స్వయంగా మురుగు కాలువలోకి దిగి, అందులోనే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మురుగు నీటి మధ్యలో కేక్ కటింగ్..
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో, ఆగ్రాలోని న్యూ విజయ్ నగర్ కాలనీ పరిధిలోని నాగ్లా ధాని ప్రాంతానికి చెందినదిగా అధికారులు గుర్తించారు.
కాలువలోని మురికి నీటి మధ్యలో ఒక గుండ్రని బల్లను ఏర్పాటు చేసి, దానిపై శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని కప్పారు. ఆ వస్త్రంపై బర్త్డే కేక్ ఉంచారు.
స్థానిక బీజేపీ కౌన్సిలర్ కిషన్ నాయక్ (ప్రసాద్ జీ) ఆ మురుగు నీటిలోనే నిలబడగా, మద్దతుదారులు ఆయనకు బంతిపూల దండ వేసి, తలపై ప్రకాశవంతమైన గులాబీ రంగు తలపాగా పెట్టారు.
“ప్రసాద్ జీ జిందాబాద్.. కౌన్సిలర్ వర్ధిల్లాలి!” అంటూ చుట్టూ ఉన్న పురుషులు వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు.
12 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపాలిటీ..
వర్షాకాలానికి ముందే నగరవ్యాప్తంగా ఉన్న మురుగు కాలువల (Drains) శుభ్రతను పూర్తి చేస్తామని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గొప్పలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఘోరంగా ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది.
ఈ నాగ్లా ధాని ప్రాంతంలోని కాలువ పూర్తిగా పూడికతో నిండిపోయి స్థానికులకు నరకం చూపిస్తోంది. దీనిపై దాదాపు 12 సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపణలు ఉన్నాయి.
తన నియోజకవర్గంలోని కాలువ శుభ్రం కాకపోవడం, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని గమనించిన కౌన్సిలర్ కిషన్ నాయక్.. అధికారుల కళ్ళు తెరిపించడానికి తన పుట్టినరోజునే ఈ వినూత్న నిరసన అస్త్రంగా మార్చుకున్నారు.
స్మార్ట్ సిటీ ఆగ్రాలోని మున్సిపల్ వ్యవస్థ తీరును ఈ వీడియో ఎండగడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







