E20 Fuel Vehicle Insurance Claims | వాహనాలలో ఈ20 (E20 – 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) ఇంధనాన్ని ఉపయోగిస్తే వాహన బీమా (Vehicle Insurance) క్లెయిమ్లు తిరస్కరించబడతాయని, ఇన్సూరెన్స్ వర్తించదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఈ వైరల్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఈ20 ఇంధనాన్ని వాడినంత మాత్రాన వాహన బీమా పాలసీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ వెల్లడించిన నిజాలు..
సోషల్ మీడియాలో లీకైన తప్పుడు సమాచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ20 ఇంధనం కారణంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లను కంపెనీలు తిరస్కరిస్తాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఐబీ తేల్చి చెప్పింది.
సామాన్య ప్రజలు, వాహనదారులు ఇంటర్నెట్లో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక వనరుల (Official Sources) ద్వారా నిజానిజాలను ధ్రువీకరించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దేశవ్యాప్తంగా ‘ఇథనాల్’ విప్లవం.. లక్ష్యాలు ఇవే..
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు (Crude Oil) పై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ ఇంధన భద్రతను పెంచడం, అలాగే పర్యావరణ పరిరక్షణే (Eco-Friendly) ప్రధాన లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రోత్సహిస్తోంది.
ప్రస్తుతం ఈ20 ఇంధనం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరింత అధునాతనమైన ఈ85 (E85) ఇంధనాన్ని కూడా అధికారికంగా ప్రారంభించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48 పెట్రోల్ బంకుల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్న ఈ ఈ85 ఇంధన కేంద్రాలను 2026 చివరి నాటికి 500 కేంద్రాలకు, అలాగే 2027 చివరి నాటికి ఏకంగా 5 వేల కేంద్రాలకు విస్తరించాలని కేంద్రం భారీ లక్ష్యంగా పెట్టుకుంది.











