Leander Paes joins BJP | ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా 2025 డిసెంబర్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటనను నిర్వహించిన తీరును ఆయన తప్పుబట్టారు.
వేలాది మంది అభిమానులు టికెట్లు కొనుగోలు చేసినా, మెస్సీని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారని, ఆ కార్యక్రమం ఒక ‘విషాదం’లా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!
“ఒకవేళ దాదా సౌరవ్ గంగూలీ ఈ ఈవెంట్ను హ్యాండిల్ చేసి ఉంటే, మెస్సీని గౌరవప్రదంగా చూసుకునేవారు” అని పేస్ వ్యాఖ్యానించారు.
తన బెంగాలీ మూలాలపై వస్తున్న విమర్శలకు కూడా పేస్ ధీటుగా స్పందించారు.
“నా పేరు సౌరవ్ గంగూలీ కాకపోవచ్చు, కానీ నేను నరనరాల్లో బెంగాలీని, భారతీయుడిని. కోల్కతాలోనే నేను పుట్టి పెరిగాను. నా టెన్నిస్ ప్రయాణం ఇక్కడి సౌత్ క్లబ్లోనే మొదలైంది” అని స్పష్టం చేశారు.
బెంగాల్లో క్రీడా మౌలిక సదుపాయాల లోపంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 100 ఏళ్లలో కోల్కతా నుండి కేవలం నాలుగు ఒలింపిక్ మెడల్స్ మాత్రమే రావడం విచారకరమని, కనీసం ఒక ఇండోర్ టెన్నిస్ కోర్ట్ కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
Read Also: ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లా..! మిస్టర్ నాగ్ సెటైరికల్ ఇంటర్వ్యూ వైరల్!
ప్రధాని నరేంద్ర మోదీ తనను ‘బెంగాల్ పుత్రుడి’గా ఆదరించారని, దేశ సేవ చేసే అవకాశం కల్పించారని పేస్ తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడం, క్రీడలను అభివృద్ధి చేయడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
2036 నాటికి భారతదేశాన్ని క్రీడా రంగంలో సూపర్ పవర్గా మార్చడమే తన విజన్ అని, రాజకీయాల్లో నిజాయితీగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేస్ రాకతో బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.










