- మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ!
TGSRTC Offer | హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత వదంతుల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ కడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని కోరుతూ.. ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి (IPS) కీలక ప్రకటన చేశారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేక రాయితీలు..
హైదరాబాద్ నగర పరిధిలో నడిచే లగ్జరీ విభాగపు బస్సుల్లో ప్రయాణికులను ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించింది.
“బంకుల వద్ద వేచి ఉండి సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు దండగ.. సురక్షితమైన ఆర్టీసీ బస్సులు ఉండగా” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సొంత వాహనాలపై వెళ్లే ఖర్చుతో పోలిస్తే, ఈ రాయితీతో కూడిన ఆర్టీసీ ప్రయాణం అత్యంత చౌకైనదని ఆయన గుర్తు చేశారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం నగరవ్యాప్తంగా 3200 బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రద్దీ ఇంకా పెరిగితే డిపోల్లో సిద్ధంగా ఉన్న రిజర్వ్ బస్సులను కూడా తక్షణమే రోడ్లపైకి తెస్తామని ఎండీ స్పష్టం చేశారు.
ఇంధన కొరత భయం వీడి, పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ బస్సులను (EV Buses) వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా, హాయిగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.






