- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ రాసిచ్చిన అభ్యర్థి!
Municipal Elections Campaign | ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ల (Bond Papers)పై హమీలు సంప్రదాయంగా మారాయి. అభ్యర్థులు తాము గెలిస్తే ఏయే పనులు చేస్తామో వివరిస్తూ ఒక బాండ్ పేపర్ మీద రాసి ప్రచారం చేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ట్రెండ్ బాగా కనిపించింది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బాండ్ పేపర్ ప్రచారం జోరందుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మున్సిపల్ పోరులో నిలిచిన ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే సొంత డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు తన హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు.
తనను గెలిపిస్తే తన వార్డు పరిధిలో ఉండే అమ్మాయిల వివాహాలకు రూ.25,016, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని కూడా బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.










