- ట్రోలింగ్ పై లావణ్య ఆగ్రహం!
Lavanya Tripathi ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఉపాసన (Ramcharan-Upasana) దంపతులకు ఇటీవల కవలలు అమ్మాయి అబ్బాయి జన్మించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదే సమయంలో మెగా స్టార్ చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ వ్యాఖ్యలను కొంతమంది మళ్లీ మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.
ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారని, ఒక్క వారసుడిని కూడా ఇవ్వమని చరణ్ని అడుగుతున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ మాటలను కొందరు సోషల్ మీడియాలో కొందరు తప్పుబట్టారు.
అబ్బాయే వారసుడా.. అమ్మాయి కాదా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తాజగా పాత వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తెచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు.
“ఇలాంటి పోస్టులు అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా, ఒక సంతోషకరమైన క్షణాన్ని అసహ్యకరంగా మార్చే ప్రయత్నంలా ఉన్నాయి” అంటూ ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి గారు తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంత ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారో బయటవారికి తెలియదని పేర్కొన్నారు. ఆయన చేసే పనుల్లో కనీసం ఒక శాతం కూడా చేయలేని వారు ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. నిజంగా తెలియని వ్యక్తుల గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆమె సూచించారు.










